21 ఏళ్ల వివాహ బంధం.. మహేశ్‌పై ప్రేమను చాటుకున్న నమ్రత.. ప్రియాంక చోప్రా స్పెషల్ రియాక్షన్!

  • 21వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మహేశ్‌ బాబు, నమ్రత
  • సోషల్ మీడియాలో పాత ఫొటోతో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నమ్రత
  • రెండు దశాబ్దాలు గడిచినా ప్రతిరోజూ మహేశ్‌నే ఎంచుకుంటానన్న నమ్రత
  • ఈ పోస్ట్‌పై ప్రియాంక చోప్రా ఎమోజీలతో స్పందన
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు తమ వివాహ బంధంలో 21 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. మహేశ్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఒక పాత ఫొటోను షేర్ చేసి, తన భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

"రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ ప్రతిరోజూ నిన్నే ఎంచుకుంటాను" అంటూ నమ్రత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను మహేశ్‌ బాబు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీషేర్ చేశారు. టాలీవుడ్‌లో అత్యంత అన్యోన్య జంటగా పేరున్న వీరిద్దరి బంధానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ పోస్ట్‌పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించడం విశేషం. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో ఆమె తన అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మహేశ్‌ బాబు, ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఆమె కామెంట్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

2000 సంవత్సరంలో 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో మహేశ్‌, నమ్రత తొలిసారి కలుసుకున్నారు. కొన్నాళ్ల ప్రేమ అనంతరం 2005 ఫిబ్రవరి 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2006లో గౌతమ్, 2012లో సితార జన్మించారు.

Mahesh Babu
Namrata Shirodkar
Priyanka Chopra
Varanasi movie
SS Rajamouli
Telugu cinema
marriage anniversary
Tollywood couple
Gautam
Sitara

More Telugu News